Plane Crash: విమానయాన రంగంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్ వైమానిక దళానికి (BAF) చెందిన చైనా తయారీ F-7 ఫైటర్ జెట్ ఢాకాలోని ఉత్తరాలోని మైల్స్టోన్ కళాశాల సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరినట్లు సమాచారం. మరో వంద మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా దళాల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంజిన్లో సాంకేతిక లోపంతో విమానం కాలేజీపై కూలడంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వందల మంది విద్యార్థులు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థుల పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

నెల వ్యవధిలోనే ఇది మూడో తీవ్ర ప్రమాదం కావడం అందరినీ కలిచివేస్తోంది. ఇటీవలె అహ్మదాబాద్లో ఏయిర్ ఇండియా విమానం ఓ కాలేజీపై కూలిన ఘటనలో భారీ ఎత్తున ప్రయాణీకులు, కాలేజీ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీని తర్వాత లండన్లో మరో విమానం అదుపుతప్పింది. బంగ్లాదేశ్ లో జరిగిన ఈరోజటి ప్రమాదంలో ప్రయాణీకులెవరూ లేకపోయినా కింద కాలేజీ భవనంలో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అన్ని దేశాల అధినేతలు విచారం వ్యక్తం చేశారు.
