Jagtial: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని మద్దునూర్ గ్రామంలో ఇరవై ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేపట్టాలని.. ప్రస్తుత పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ధర్మపురి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మేకల అక్షయ్ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం జగిత్యాల జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.
దీంతోపాటు గ్రామంలో ఒక్క ఆశా వర్కర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని.. వెంటనే ఆశా వర్కర్లతో పాటు ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు సైతం భర్తీ చేయాలని కోరారు. వీటివల్ల గ్రామంలోని బాలలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించి తక్షణ చర్యలు చేపట్టాలని అక్షయ్ కోరారు.

ప్రజావాణిలో అందిన ఈ వినతులపై స్పందించిన ఉన్నతాధికారులు సంబంధిత విభాగాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏళ్లుగా పేరుకుపోయిన ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే సంబంధిత శాఖల మంత్రులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కలుస్తానని అక్షయ్ తెలిపారు.
Read more: మద్దునూర్ ప్రభుత్వ బడి నిర్మించాలని వినతి


