Kantara: Chapter 1 – షూటింగ్‌లో మరో ప్రమాదం.. జ‌లాశ‌యంలో హీరో బోటు బోల్తా!

Kantara Movie

Share this article

Kantara: Chapter 1 – ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ షెట్టి నటిస్తున్న ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా షూటింగ్‌లో మళ్లీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు (జూన్ 15) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని మణి జలాశయం వద్ద షూటింగ్ జరుగుతుండగా, రిషబ్ షెట్టి సహా 30 మంది ఆర్టిస్ట్‌లు ప్రయాణిస్తున్న బోటు నీటిలో తిర‌గ‌బ‌డింది. షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించగా, అప్రమత్తమైన యూనిట్ సభ్యులు వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడం కొంత ఊరట కలిగించినప్పటికీ, కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు జల సమాధి అయ్యాయి.

ఈ ఘటనతో యూనిట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బోటు లాక్ ఊడిపోవ‌డం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ షెట్టి స్వయంగా బోటులో ఉన్నారు. ఈ ప్ర‌మాదం నుంచి ఆయ‌న‌ చాకచక్యంగా బయటపడ్డారు.

కాంతారాను వెంటాడుతున్న ప్ర‌మాదాలు!
ఇది కాంతారా: చాప్టర్ 1 చిత్రానికి మూడో ప్రధాన ప్రమాదం కావడం గమనార్హం. గత ఏడాది ఈ చిత్ర షూటింగ్ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్‌లు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో కొందరు గాయపడ్డారు. అదే ఏడాది మరో నటుడు కపిల్ నదిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. అనంతరం రాకేష్ పూజారి అనే నటుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఇక తాజాగా, నిన్న (జూన్ 14) మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ (43) కూడా గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. వరుస ప్రమాదాలు చిత్ర యూనిట్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

‘కాంతారా: చాప్టర్ 1’ సినిమాను రిషబ్ షెట్టి స్వయంగా రాస్తూ, దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం గతంలో వచ్చిన ‘కాంతారా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2025 అక్టోబర్‌లో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం షూటింగ్‌ కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, మణి జలాశయం, అరణ్య ప్రాంతాల్లో వేగంగా జరుగుతోంది. సురక్షిత ప్రమాణాలు పాటిస్తూ చిత్రీకరణ కొనసాగిస్తున్నామని యూనిట్ వర్గాలు తెలిపాయి. కానీ వరుస ఘటనల నేపథ్యంలో యూనిట్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ వరుస సంఘటనలతో ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమాపై కొత్త ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా రష్మీ శెట్టి, సత్య, మంజు శేఖర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్‌లు, ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది.

సినిమా యూనిట్ ఈ ప్రమాదాలపై పూర్తి దర్యాప్తు జరిపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రిషబ్ షెట్టి అభిమానులు తమ అభిమాన నటుడికి ఏమి కాకపోవడం పట్ల ఊపిరి పీల్చుకుంటున్నారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *