IT.. కేరాఫ్ TG!

IT in Telangana

Share this article

ఏడాదిలోనే 70 కొత్త గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్లు.. దిగ్గ‌జ సంస్థ‌లకు కాంగ్రెస్ స‌ర్కార్ రెడ్ కార్పెట్‌.. ఆవిష్క‌ర్త‌ల‌కు ప్రోత్సాహం.. హైద‌రాబాద్ దాటి జిల్లాల‌కు విస్త‌రిస్తున్న అంకురాలు.

ర‌చ‌యిత‌ ✍️పి. భానుచందర్ రెడ్డి,
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పీఆర్వో

ఒకప్పుడు ఐటీ అనగానే అందరికీ ఠక్కున మహారాష్ట్ర, కర్ణాట‌క‌ లాంటి రాష్ట్రాలు గుర్తుకొచ్చేవి. కానీ… ఇప్పడు సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశనంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో “తెలంగాణే ఐటీకి దిక్సూచి” అనే స్థాయికి మన రాష్ట్రం ఎదిగింది. ముఖ్యంగా బెంగళూరు, పుణే, గుర్ గావ్ లాంటి నగరాలను వెనక్కి నెట్టి ‘గ్లోబల్ ఐటీ హబ్’ గా మ‌న విశ్వ‌న‌గ‌రి హైద‌రాబాద్‌ టెక్ దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది.

2.7 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు..
2023–24లో దేశవ్యాప్తంగా ఐటీ ఎగుమతులు విలువ రూ.9.43 లక్షల కోట్లు. ఇందులో తెలంగాణ వాటా రూ.2.7 లక్షల కోట్లు. ఇది మొత్తంలో 15.56 శాతం. 2022 – 23 తో పోలిస్తే 11.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. దేశ సగటు కంటే ఇది నాలుగింతలు ఎక్కువ కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ ఐటీ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ‘తెలంగాణ సోషియో – ఎకానమిక్ అవుట్ లుక్ 2025’ నివేదిక ప్రకారం రాష్ట్ర గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్(జీఎస్ వీఏ)లో సేవా రంగం వాటా 66.3 శాతం. ఇందులో అధిక వాటా ఐటీ రంగానిదే కావడం గమనార్హం.

కొత్తగా 40వేల ఐటీ ఉద్యోగాలు..
ప్రస్తుతం హైదరాబాద్ లో 1500 కు పైగా ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సుమారు 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలో 10 అత్యుత్తమ టెక్ దిగ్గజాల్లో 7 కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, సేల్స్ ఫోర్స్ లాంటివెన్నో ఉన్నాయి. ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందజలో ఉంది. ఈ ఏడాది దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలను చేసుకున్నారు. ఇందులో రూ.1.04 లక్షల కోట్లు ఐటీ, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించినవి మాత్రమే కావడం గమనార్హం. షాద్ నగర్లో మైక్రోసాఫ్ట్ రూ.16వేల కోట్లతో డేటా క్లస్టర్ ను నిర్మిస్తోంది. ప్రపంచంలో నాలుగోది, భారత్ లో మొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ కేంద్రాన్ని గూగుల్ ఇటీవలె హైదరాబాద్ లో ప్రారంభించింది. 2023-24లో కొత్తగా 40వేల మందికి కొత్తగా ఐటీ ఉద్యోగాలొచ్చినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

IT care of Telangana

ఏడాదిలో కొత్తగా 70 జీసీసీలు..
ఇటీవల కాలంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్ గా హైదరాబాద్ మారింది. ప్రస్తుతం 355 జీసీసీలు సుమారు 3.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో 70 గతేడాదిలోనే ప్రారంభం కావడం గమనార్హం. దేశంలోని ఏ నగరం కూడా ఈ రికార్డును సాధించలేదు. ఇవన్నీ కేవలం బ్యాక్‌ఆఫీస్ కార్యకలాపాలకు పరిమితం కావడం లేదు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, గ్లోబల్ ఉత్పత్తుల రూపకల్పన వంటి కీలక అంశాల్లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ జీసీసీలను గ్లోబల్ వాల్యూ యాడెడ్(జీవీఏ) కేంద్రాలుగా… నూతన ఆవిష్కరణలకు అడ్డాగా మార్చాలని మంత్రి శ్రీధర్ బాబు సంకల్పించారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.

స్కిల్లింగ్… అప్ స్కిల్లింగ్…
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కేవలం ఐటీ రంగం అభివృద్ధిపైనే దృష్టి సారించలేదు. ఈ రంగానికి కావాల్సిన అత్యుత్తమ మానవ వనరులను అందించే బాధ్యతను తీసుకుంది. ఈ ప్రక్రియలో ఐటీ దిగ్గజ సంస్థలను భాగస్వామ్యం చేసి… వారికి కావాల్సిన కరిక్యులమ్ ను రూపొందించి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ద్వారా ఇప్పటికే సుమారు 10 లక్షల మందికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పంచారు. ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీని అనుసంధానం చేసి డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ) ద్వారా సుమారు 4 లక్షల మందికి పట్టభద్రులకు ఐటీ రంగంలోని ఉపాధి, కోర్సులపై మార్గనిర్దేశం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో గతేడాది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి… దేశానికే మోడల్‌గా నిలిచే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ఏఐ విద్యను బోధిస్తూ భవిష్యత్తు నిపుణులను తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

IT

హైద‌రాబాదే కాదు.. తెలంగాణ మొత్తం!
‘ఐటీ అంటే హైదరాబాద్ మాత్రమే కాదు — తెలంగాణ మొత్తం’ అనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన అడుగులు వేస్తోంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి టైర్ పట్టణాలు, నగరాలకు విస్తరించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే నిర్మాణం పూర్తై ఖాళీగా ఉన్న ఐటీ టవర్లలో కొత్త ఐటీ కంపెనీలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అసంపూర్తిగా నిలిచిపోయిన టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహాకాలిస్తోంది.

ఆవిష్క‌ర్త‌ల‌కు ప్రోత్సాహం..
ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి… తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ ‘టీ-హబ్’, హార్డ్‌వేర్ ప్రోటోటైపింగ్‌కు దేశంలోనే అతిపెద్ద ల్యాబ్ ‘టీ-వర్క్స్’ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ‘వీ హబ్’ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బలోపేతం చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు ‘టీ-ఎయిమ్ ’ పేరిట ప్రత్యేక మిషన్ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో టీ హబ్ మార్గనిర్దేశనంలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యలు టెక్ ఆధారిత స్టార్టప్ కల్చర్ ను రూపొందించడంలో తెలంగాణను దేశంలో ముందంజలో ఉంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Google Office Revanth Reddy

ముగింపు..
సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వం, మంత్రి శ్రీధర్ బాబు పకడ్బందీ కార్యాచరణ ఐటీ రంగ విప్లవానికి తెలంగాణను కేంద్రంగా మార్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్ కు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఈ లక్ష్య సాధనలో ఐటీ రంగాన్ని కీలకం చేసేందుకు అయిదేళ్ల కోసం కాకుండా భావితరాల కోసం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తూ చిత్తశుద్ధితో అమలు చేస్తుండటం అభినందనీయం.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *