Cricket: గిల్ సేనకు అస‌లు పరీక్ష నేడే!

England India Test cricket

Share this article

Cricket: టీమిండియాకు కొత్త నాయకత్వంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో భారత జట్టు తొలిసారి ఐదు టెస్టుల సిరీస్‌ కోసం మైదానంలోకి దిగబోతోంది. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అండర్సన్‌ – టెండూల్కర్‌ సిరీస్‌ ఈ శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. మొదటి టెస్టుకు హెడింగ్లీ వేదిక కానుండగా, దీనిపై భారత్‌ విజయావకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ సిరీస్‌లో భారత జట్టు సీనియర్ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌ లేని పరిస్థితిలో బరిలోకి దిగనుంది. ఇది భారత్‌కు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే దశ. అంతే కాదు, ఇంగ్లండ్‌ గడ్డపై గెలిచే ప్రయత్నం చేయడం భారత జట్టుకు ఓ గొప్ప పరీక్ష. గత 93 సంవత్సరాలుగా ఇక్కడ పర్యటిస్తున్న భారత జట్టు కేవలం మూడు సార్లు మాత్రమే సిరీస్‌ను సొంతం చేసుకుంది. 1971, 1986, 2007 లలో మాత్రమే భారత్‌ ఇంగ్లండ్‌ నేలపై సిరీస్‌ను గెలవడం సాధ్యపడింది. అలాగే హెడింగ్లీలో భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు ఆడగా, కేవలం రెండు విజయాలు మాత్రమే భారత్ ఖాతాలో ఉన్నాయి.

England Indian Cricket Match Rishab Pant

బ్యాటింగ్‌పై అంచనాలు
భారత బ్యాటింగ్‌ లైనప్‌ ఈ సిరీస్‌లో ఎంత మేర ప్రభావం చూపగలదో అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారిగా టెస్ట్ ఆడబోతున్నాడు. అతడికి జతగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మూడు నంబరులో సాయి సుదర్శన్‌ అరంగేట్రం చేసే అవకాశముండగా, నాలుగో స్థానం గిల్‌కే ఖాయం. మిడిల్‌ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌, కరుణ్‌ నాయర్‌లు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే ఇంగ్లండ్‌లో గిల్ ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో కేవలం 88 పరుగులే చేయగలిగాడు. గత పర్యటనలో రాహుల్, పంత్‌లు అద్భుతంగా ఆడి శతకాలు సాధించారు.

బౌలింగ్‌ విభాగంలో ప్రధానంగా బుమ్రాపై ఆధారపడే అవకాశముంది. పేస్ లైనప్‌లో మహ్మద్ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణలు జట్టులో ఉండనున్నారు. స్పిన్నర్‌గా జడేజానే ముఖ్య భూమిక పోషించనున్నాడు. ఆల్‌రౌండర్‌ స్పాట్‌కు శార్దూల్‌ ఠాకూర్‌ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇంగ్లండ్‌ జట్టు ఫోకస్‌
ఇంగ్లండ్‌ బౌలింగ్‌ యూనిట్‌ ఈ సిరీస్‌లో అనుభవజ్ఞులైన అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌లను కోల్పోయిన నేపథ్యంలో కొంత బలహీనంగా కనిపిస్తోంది. కొత్త పేసర్లు వోక్స్‌, కార్స్‌, టంగ్‌లతో బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్‌గా షోయబ్‌ బషీర్‌ కీలకంగా మారే అవకాశముంది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం ఇంగ్లండ్‌ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. జో రూట్‌ మాదిరి ప్రపంచ స్థాయి బ్యాటర్‌ జట్టుకు ఆధారంగా నిలుస్తాడు. వన్‌డౌన్‌ ప్లేయర్ ఒల్లీ పోప్‌ ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 170 పరుగులు చేయడం విశేషం. టాప్ ఆర్డర్‌లో క్రాలే, డకెట్‌లు శుభారంభం అందిస్తే, మిడిల్‌ ఆర్డర్‌లో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ లు భారీ స్కోరు చేసే సామర్థ్యం కలవారు. వోక్స్‌ కూడా టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడే.

తుది జట్లు (అంచనా)
భారత జట్టు
: కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.

ఇంగ్లండ్‌ జట్టు: జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఒల్లీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమీ స్మిత్‌, క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్స్‌, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.

రికార్డుల దూరంలో జో రూట్‌
ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య జరిగిన అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా జో రూట్‌ నిలవడానికి మరో 179 పరుగులు మాత్రమే అవసరం. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ 4036 పరుగులతో టాప్‌లో, సచిన్‌ టెండూల్కర్‌ 3990 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇదే కాకుండా టెస్టుల్లో ఎక్కువ అర్ధ సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగా గవాస్కర్‌ (16 హాఫ్ సెంచరీలు) ఉన్నాడు. రూట్‌ మరో ఆరు అర్ధ సెంచరీలు సాధిస్తే ఈ రికార్డును కూడా అధిగమించవచ్చు.

పిచ్‌ పరిస్థితులు, వాతావరణం
హెడింగ్లీ పిచ్‌పై 8 మిల్లీమీటర్ల పచ్చిక ఉంది. దీనివల్ల ప్రారంభం లో సీమర్లకు సహకరించే అవకాశం ఉంది. వాతావరణం కొంత మబ్బుగా ఉన్నా వర్షం పడే అవకాశం లేదు. లీడ్స్‌లో శుక్రవారం ఉష్ణోగ్రత సుమారు 29 డిగ్రీలుగా ఉండనుంది. అయితే రోజులు గడిచేకొద్దీ పిచ్‌ పొడిబారే అవకాశం ఉంది. దీని వల్ల బ్యాటింగ్‌ సులభతరం కానుంది. బ్యాటర్లు ఓపిగ్గా ఆడితే భారీ స్కోర్లు సాధించవచ్చు.

IPL కన్నా విలువైన విజయం: గిల్‌
ఈ టూర్‌పై భారత కెప్టెన్‌ గిల్‌ మాట్లాడుతూ, “ఐపీఎల్‌ ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఇంగ్లండ్‌, ఆసీస్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో టెస్టు సిరీస్‌ గెలవడం ప్రత్యేక విషయం. టెస్టు జట్టుకు నాయకత్వం వహించడం నాకు గొప్ప గౌరవం. టెస్టుల్లో విజయానికి 20 వికెట్లు తీస్తేనే గెలిచినట్లు. మా బౌలర్ల లక్ష్యం కూడా అదే” అని చెప్పాడు.

“బుమ్రాకు భయపడం” – స్టోక్స్‌
ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాట్లాడుతూ, “బుమ్రా గొప్ప బౌలర్‌. అతడు ప్రమాదకారే. కానీ మేము కేవలం ఒక్క ఆటగాడిపై దృష్టి పెట్టే వాళ్లం కాం. అంతర్జాతీయ క్రికెట్‌లో భయం ఉండదు. ఒక్క ఆటగాడు సిరీస్‌ మార్చడని భావించలేం. భారత జట్టును చిన్నగా చూడం. విరాట్‌, రోహిత్‌, అశ్విన్‌ లేనన్నదే మాకు కీలకం కాదు” అని పేర్కొన్నాడు.

England India Test Cricket

“శుభ్‌మన్‌కు సమయం ఇవ్వాలి” – సచిన్‌
భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మాట్లాడుతూ, “శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వం వహించడానికి సరైన సమయం ఇవ్వాలి. జట్టులోని ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌ అతడికి పూర్తి మద్దతు ఇవ్వాలి. ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో బ్యాటర్లు తాము ఎలా ఆడాలో అర్థం చేసుకుని, తమ ఆటతీరును మార్చుకోవాలి. లీడ్స్‌ పిచ్‌ కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. రెండు స్పిన్నర్లు తీసుకోవచ్చు” అని సలహా ఇచ్చారు.

గిల్‌కు పెద్ద సవాళ్లు: రవిశాస్త్రి, కిర్‌స్టెన్‌
భారత మాజీ కెప్టెన్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ, “ఇంగ్లండ్‌ పరిస్థితులు గిల్‌కి పెద్ద పరీక్ష. ఇక్కడ గెలవాలంటే ఓర్పు, వ్యూహం అవసరం. గిల్‌ ఈ పర్యటనతో మంచి అనుభవం సేకరిస్తాడు” అని అన్నారు. భారత మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ మాట్లాడుతూ, “శుభ్‌మన్‌ గొప్ప నాయకుడిగా ఎదుగుతాడని నమ్మకం. అతడి నైపుణ్యం, లోబోదన అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి తగినవి” అని అభిప్రాయపడ్డారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *