మొన్న ఇంటలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు.. నిన్న సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ ను అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్
Drugs: తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి.. ఇతర మాదక ద్రవ్యాల కట్టడికి సర్కారు ఈగల్ టీం ఇప్పుడు మత్తుబాబులకు దడ పుట్టిస్తోంది. పోలీసు, రాజకీయ నాయకులు.. వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ డ్రగ్ పెడ్లర్లు, గంజాయ్ బ్యాచ్ల ఆటకట్టిస్తోంది. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మల్నాడు రెస్టారెంట్లోని డ్రగ్స్ పార్టీ కేసులో నిందితులు ఒక్కొక్కరిగా అరెస్టవుతున్నారు. ఇందులో ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు వినిపించగా.. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల కుమారులను ఈగల్ టీం అరెస్టు చేసింది.
ఈ కేసులో బుధవారం సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అయితే, మంగళవారమే ఈ కేసులో తెలంగాణ ఇంటలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజా కూడా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం మోహన్, రాహుల్ తేజా, హర్ష, మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో పాటు పలువురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

డొంక కదులుతోంది..!
మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడి పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈగల్ టీం అతడిని అరెస్ట్ చేసింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెలలో నిజామాబాద్లో భారీగా చిక్కిన డ్రగ్స్ కేసులో రాహుల్ ప్రధాన సూత్రదారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఏ3గా ఉన్నా పోలీసులు ఉన్నతాధికారుల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేసి అరెస్టు చేయలేదని తెలుసుకున్న ఈగల్ రంగంలోకి దిగింది. ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు ఇప్పటికే అరెస్టైన ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, విచారణలో ఇప్పటికే పలువురు పోలీస్ సీనియర్ అధికారుల కుమారులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.
