BJP: తెలంగాణ బీజేపీలో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. కట్టర్ హిందువుగా, పార్టీకి వెన్నుముకగా ఇన్నేళ్లు నిలబడిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సోమవారం హైదరాబాద్లో అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద విలేకర్లతో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లితే.. తనను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
డిస్క్వాలిఫై చేయమన్నాను..
కిషన్ రెడ్డికి లిఖిత పూర్వకంగానే లేఖ రాసినట్లు తెలిపారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి చెప్పి.. లేఖ రాశానన్నారు. ఎమ్మెల్యేగా డిస్ క్వాలీఫై చేసేలా అసెంబ్లీ స్పీకర్కు లేఖ పంపమని ఆయనతో పేర్కొన్నట్లు చెప్పారు. 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. తాను టెర్రరిస్టుల హిట్ లిస్ట్లో ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కోరుకుంటున్నారని వివరించారు. తనకు ముగ్గురు కౌన్సిల్ మెంబర్లు మద్దతిచ్చారని.. ఒక్కరాత్రిలోనే అంతా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తాను బీజేపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ కౌన్సిల్ మెంబర్లు, పార్టీ నేతలను కొందరు బెదిరించారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను ముహూర్తం సైతం చూసుకున్నానని తెలిపారు. మీకో దండం.. మీ పార్టీకో దండమని బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

