అనుకోకుండా తనిఖీలకు వెళ్లిన అధికారులకు షాక్!
America: లాస్ వేగాస్: ఫ్రీజర్ల నిండా హెచ్ఐవీ రక్త నమూనాలు.. మలేరియా క్రిములు.. ఎబోలా వైరస్ ఉత్పత్తి చేసే టెస్టింగ్ ట్యూబులు.. 24*7 షిఫ్టుల వారీగా పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు. అదీ చైనాలో కాదు.. అమెరికాలో. అందులోనూ ఏ అనుమతీ లేకుండా. ఇప్పుడీ వార్త.. గత రెండు రోజులగా యావత్ అమెరికాను కుదిపేస్తోంది. ఈ ల్యాబ్కు అనుమతులు లేకపోగా.. ఇక్కడ ఈ కార్యకలాపాలు ఏళ్లుగా నడుస్తున్నాయని చుట్టూ ఉన్న స్థానికులకూ తెలియదట. కనీసం 20రకల వింత, ప్రమాదకర వైరస్లు, సంక్రమించే వ్యాధులకు సంబంధించిన మూలకాలు ఉన్నట్లు గుర్తించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అమెరికా అధికారులు.. ఇక్కడ ఇన్ని శాంపిళ్లు భద్రపరచడానికి వెనక కారణాలను అన్వేషిస్తున్నారు.
ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన Centers for Disease Control and Prevention నిపుణులు స్వాధీనం చేసుకున్న నమూనాలను పరిశీలించారు. అందులో హెచ్ఐవీ, క్షయవ్యాధి (టీబీ), అత్యంత ప్రమాదకరమైన మలేరియా రకం ఉన్నట్లు తేలింది. అంతేకాదు, ఒక ఫ్రిజ్ పై “ఎబోలా” అని లేబుల్ ఉండటాన్ని గుర్తించడంతో దర్యాప్తు బృందాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.

ల్యాబ్ నిర్వాహకులు బయటకు చెప్పుకున్న ఉద్దేశం పరీక్షా కిట్లు విక్రయించడం అయినప్పటికీ, అసలు వ్యవహారం వేరేలా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేంద్రం ప్రధానంగా చైనా నుంచి నకిలీ టెస్ట్ కిట్లను దిగుమతి చేసి అమెరికాలో తిరిగి అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. స్వాధీనం చేసిన అనేక కిట్లపై సరైన లేబుల్స్ లేకపోవడం, భద్రతా పత్రాలు లేనివి కావడం గమనార్హం.
అవసరమైన అనుమతులు, బయోసేఫ్టీ ప్రమాణాలు లేకుండానే ఈ ల్యాబ్ నడుస్తోందని అధికారులు వెల్లడించారు. జీవ నమూనాలు, పరీక్షా సామగ్రిని సాధారణ ఫ్రిజ్ లు, ఫ్రీజర్ లలోనే నిల్వ చేసినట్లు గుర్తించారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనుకోకుండా తనిఖీలకు వెళ్లి..!
సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ల్యాబ్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని చూసిన వెంటనే ప్రాంగణాన్ని సీజ్ చేసి, ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తరలించి నిర్వీర్యం చేశారు. ఈ నకిలీ కిట్లు ఎంతమంది వరకు చేరాయన్న దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వ్యాప్తి కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ నియంత్రణ లేకుండా ఇన్ని ప్రమాదకర కారకాలు ఒకేచోట ఉండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ల్యాబ్ తో సంబంధం ఉన్నవారి వివరాలు సేకరించి, అవసరమైన వైద్య పర్యవేక్షణ చేపడుతున్నారు.
ఈ అక్రమ కేంద్రం ఎంతకాలంగా పనిచేస్తోంది, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, విదేశీ కనెక్షన్లు ఏమిటన్న అంశాలపై లోతైన దర్యాప్తు సాగుతోంది. విచారణ పూర్తయ్యాక కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ల్యాబ్లో సృష్టించిన కొవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. కొవిడ్-19 సృష్టిలోనూ చైనా ఇదే విధానం పాటించిందన్న విమర్శల నడుమ ఇప్పుడు మరోమారు సంచలనం రేగుతోంది. ఇప్పుడు లాస్ వేగాస్లో కనుగొన్న రహస్య ల్యాబొరేటరీని అమెరికాపై చైనా చేయబోతోన్న బయోవార్ గా చూడాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీనిపై America ఏ విధంగా స్పందింస్తుందో చూడాల్సిందే.
