AP: ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, రూ.21,616 కోట్ల విలువైన మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించిన 40 శాతం పనులకు అధికారులు నేడు టెండర్లు ఆహ్వానించారు.
ప్రాజెక్టు వివరాలు:
విజయవాడ మెట్రో రైల్ టెండర్ల విలువ: రూ.10,118 కోట్లు
విశాఖపట్నం మెట్రో రైల్ టెండర్ల విలువ: రూ.11,498 కోట్లు
ఈ రెండు మెట్రో ప్రాజెక్టులూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 శాతం) అమలు చేయబడతాయి. విశాఖ, విజయవాడ మెట్రోలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి:
విశాఖ మెట్రోకు: VMRDA (Visakhapatnam Metropolitan Region Development Authority) ద్వారా రూ.4,101 కోట్లు ప్రభుత్వ వాటా
విజయవాడ మెట్రోకు: CRDA (Capital Region Development Authority) ద్వారా రూ.3,497 కోట్లు ప్రభుత్వ వాటా
ప్రస్తుతం టెండర్లు 40 శాతం పనులకు మాత్రమే ఆహ్వానించగా.. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఇది ఓ కీలక ముందడుగు. త్వరలోనే మిగిలిన పనులకు కూడా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీ అభివృద్ధిలో ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇండస్ట్రియల్ హబ్గా అవతరిస్తోన్న విశాఖతో పాటు రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న విజయవాడ నగరాల్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించటం, పర్యావరణ హితమైన ప్రయాణ మార్గాలను అందించటం, ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టుల ద్వారా సాధ్యపడనుంది. ఈ టర్మ్లోనే దీన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో కూటమి సర్కారు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.