HCA అంతా అవినీతే.. ఫేక్ క్ల‌బ్‌లతో రూ.170కోట్లు మాయం!

HCA Scams

Share this article

HCA: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువా రెడ్డి హెచ్‌సీఏపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గతంలో ఉన్నలా ఇప్పుడు లేదని, నిజంగా వ్యవస్థ బాగుంటే ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ జాతీయ స్థాయికి వెళ్లేవాడని ఆయన వ్యాఖ్యానించారు.

ఈరోజు మీడియాతో మాట్లాడిన గురువా రెడ్డి, ‘‘హెచ్‌సీఏ ఇప్పుడు హైదరాబాద్ నగర పరిధికే పరిమితమైపోయింది. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు దారి మూసేశారు. గత పది సంవత్సరాలుగా గ్రామీణ టాలెంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు’’ అన్నారు.

రూ.170 కోట్లు గోల్‌మాల్.. ఐపీఎల్ నిధుల దుర్వినియోగం?

గురువా రెడ్డి ప్రకారం, ప్రతి సంవత్సరం బీసీసీఐ ద్వారా ఐపీఎల్ నిర్వహణ నిమిత్తంగా హెచ్‌సీఏకు రూ. 100 కోట్ల వరకు నిధులు అందుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ.170 కోట్లు మాయమైనట్లు ఆరోపించారు.

‘‘విజిలెన్స్ విచారణ తర్వాత సీఐడీ రంగప్రవేశం చేసింది. దర్యాప్తులో పెద్దఎత్తున నకిలీలు బయటపడ్డాయి. నిందితులను అరెస్ట్ చేశారు’’ అని వెల్లడించారు.

నకిలీ క్లబ్‌లు – డాక్యుమెంట్ల మోసం

తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి, ఫేక్ క్లబ్‌లను క్రియేట్ చేయడాన్ని గురువా రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు.

‘‘217 మంది సభ్యులున్న క్లబ్‌లు అన్నీ నకిలీవే. ఎవరి ఆధారాలు సక్రమంగా లేవు. ఎన్నికల కమిషన్ సంపత్ కుమార్ ఇలా పోటీకి అనుమతించడమే విడ్డూరం. జగన్మోహన్ రావు అనర్హుడు. అతనికి క్రికెట్ అంటే తెలిసినా తెలుసా?’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రౌండ్ అభివృద్ధి కోసం నిధులు – కానీ వాడింది ఎవరు?

బీసీసీఐ ఇచ్చిన గ్రాంట్లను మైదానాల అభివృద్ధికి, ప్లేయర్ల అవసరాలకు వినియోగించాల్సిందిగా ఉద్దేశించినా, అవి పూర్తిగా దుర్వినియోగమయ్యాయని గురువా రెడ్డి ఆరోపించారు.

‘‘క్రీడాకారులకు సరైన పరికరాలు లేకుండా పోయాయి. క్యాంటీన్లు ఎవరికిచ్చారు? ఎంత కిక్‌బ్యాక్ తీసుకున్నారు? డేటా అంతా మా వద్ద ఉంది. రాజకీయ నాయకుల ప్రమేయాన్ని కూడా బయటపెడతాం’’ అని హెచ్చరించారు.

నేరచరిత్ర ఉన్నవారూ ఉన్నారు: జస్టిస్ నాగేశ్వర రావు నివేదిక

జస్టిస్ నాగేశ్వర రావు నివేదిక ప్రకారం, గతంలో నేరపూరిత చరిత్ర కలిగినవారూ హెచ్‌సీఏలో కీలక పదవుల్లో ఉన్నారని గుర్తించారని తెలిపారు.

‘‘ఇలాంటి వ్యవస్థల్ని క్లీన్ చేయాలంటే ప్రజలు కలిసికట్టుగా పోరాడాలి. క్రికెట్‌ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

‘‘తెలంగాణ క్రికెట్‌కు నిజమైన గుర్తింపు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది’’

తొలుత గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేస్తేనే, రాష్ట్రం మొత్తానికి క్రికెట్ పరంగా గుర్తింపు వస్తుందని గురువా రెడ్డి స్పష్టం చేశారు.

‘‘ఈ వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రతిభ వృద్ధి చెందేలా కృషి చేస్తాం. తెలంగాణ క్రికెట్‌ను నిలబెట్టే వరకు మా పోరాటం ఆగదు’’ అని తేల్చిచెప్పారు.

సూత్రధారులెవరు? డబ్బు ఎలా మాయమైంది? ఎవరు ఎన్ని పదవులు కబ్జా చేసుకున్నారు? – ఇవన్నీ త్వరలో వెలుగులోకి తీసుకొస్తామని గట్టిగా చెబుతున్న గురువా రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర క్రికెట్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

👉 మరిన్ని అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవండి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *