TG: నలుగురి జీవితాలకు సంతోషాన్ని కానుకగా ఇవ్వడం కంటే గొప్ప విషయం ఏముంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. ప్రతీ ఏటా తన పుట్టినరోజు వేడుకల్లో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపడంతోనే సంతృప్తి దక్కుతోందన్న ఆయన.. గత ఐదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై తన ఎక్స్(X) ఖాతాలో పోస్ట్ చేశారు. తన #GiftASmile క్యాంపెయిన్ ద్వారా గత ఐదు సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ మరిచిపోలేనని.. పుష్పగుచ్ఛాలు, కేకులు, ఇతర బహుమతుల కంటే సేవా కార్యక్రమాలే తన పుట్టినరోజుకి అసలైన బహుమతి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఏ సంవత్సరం ఏం చేశారు..?
🔸 2020 – 108 అంబులెన్సులు పంపిణీ: కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య రంగం అత్యవసరంగా నిలిచిన 2020లో, కేటీఆర్ తన అభిమానుల సహకారంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు 108 అంబులెన్సులను అందించారు.
🔸 2021 – వికలాంగులకు 1400 ట్రై వీలర్లు! వికలాంగుల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా అడుగులేస్తూ, 2021లో 1400కు పైగా ప్రత్యేకంగా తయారు చేసిన ట్రై వీలర్లను అవసరమున్న వారికి అందించారు.
🔸 2022 – విద్యా రంగంపై దృష్టి: సిరిసిల్ల జిల్లా విద్యార్థుల కోసం 6000 Samsung ట్యాబ్లను అందించారు. ఫలితంగా NEET, JEE వంటి పోటీ పరీక్షల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇది జీవితాంతం గుర్తుండే పని అని కేటీఆర్ పేర్కొన్నారు.
🔸 2023 – రాష్ట్ర గృహంలోని ప్రతిభావంతులకోసం ల్యాప్టాప్లు: యూసుఫ్గూడా స్టేట్ హోమ్లో ఉండే 116 మంది ప్రతిభావంతులకు i5 Dell ల్యాప్టాప్లు, శిక్షణ, కోచింగ్ సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్ను తీర్చిదిద్దారు.
🔸 2024 – మృత బట్టల కార్మికుల కుటుంబాల కోసం: సిరిసిల్లలో విషాదంగా మారుతున్న బట్టల కార్మికుల ఆత్మహత్యలు కేటీఆర్ను కదిలించాయి. 2024 సంవత్సరాన్ని ఈ కుటుంబాల కోసం అంకితం చేశారు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు.
🔸 2025 – ఈ ఏడాది పుట్టినరోజును ‘ప్రగతికి, ఆశకు, జీవితానికే’ అంకితం చేస్తూ.. గత 18 నెలల్లో సిరిసిల్లలో జరిగిన 4910 ఇన్స్టిట్యూషనల్ డెలివరీల ప్రతి ఒక్క మాతృమూర్తికి KCR కిట్ అందించనున్నట్టు తెలిపారు. “ప్రతి పథకం జీవితాన్ని మార్చేది.. కానీ ఓ జీవిత ఆరంభానికి వెలుగునిచ్చే KCR కిట్ నాకు ప్రియమైనది” అని కేటీఆర్ తెలిపారు.

కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రారంభించిన #GiftASmile ఉద్యమం.. క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున విస్తరించింది. రాష్ట్రంతో పాటు వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కార్యకర్తలు, నేతలు సైతం తమకు తోచిన విధంగా ఈ క్యాంపెయిన్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.