Ramayana: భారతీయ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మల్టీ స్టారర్ చిత్రం ‘రామాయణ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రామాయణ కథగా ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ప్రదర్శన చేయకపోవడంతో పాటు సినిమా టేకింగ్పై పెద్ద ఎత్తున విమర్శలలొచ్చాయి. దీంతో దర్శకుడు నితేశ్ తివారి ఈ పౌరాణిక కథను అత్యంత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. పూర్తి హిందూ సమాజం మనోభావాలతో ముడిపడటంతో అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇటీవలె దర్శకుడు ఓచోట వెల్లడించాడు. అధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే మోషన్ పిక్చర్ రంగంలో హాట్ టాపిక్గా మారింది.
ఈ భారీ మల్టీ స్టార్ ప్రాజెక్ట్ అధికారికంగా 2023 నవంబర్లో ప్రకటించగా, అప్పటినుంచి ఒక్కో పాత్రపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వస్తోంది. ఇందులో సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా కనిపించనున్నారు. అనిల్ కపూర్ తో పాటు మరికొందరు కీలక నటులు కూడా పలు పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ కథలో అత్యంత కీలకమయిన పాత్ర శూర్పణఖ. రామ-రావణ యుద్ధానికి కారణమైన ఆమె పాత్ర ఇప్పుడు అధికారికంగా రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో పడింది. ఈ ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మొదట శూర్పణఖ పాత్ర కోసం దర్శకనిర్మాతలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రాను సంప్రదించారు. ఆమె అంగీకరిస్తే ఈ సినిమాకు గ్లోబల్ రేంజ్లో మరింత గుర్తింపు వస్తుందని ఆశించారట. అయితే, ప్రియాంక ఇప్పటికే మహేశ్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న అంతర్జాతీయ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ అవకాశం రకుల్ వద్దకు వచ్చిందట.
ఇప్పటికే పలు భాషల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రకుల్ కెరీర్లో ఈ పాత్ర మైలురాయిగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ప్రియాంకను తీసుకుని ఈ పాత్ర చేశారు ఉంటే..? అన్న ఆలోచన ఆసక్తికరంగా మారినా – ఇప్పుడు రకుల్ చేతిలో ఉన్న ఈ ఛాలెంజింగ్ క్యారెక్టర్తో ఆమె కెరీర్లో మరో మలుపు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్కు సంబంధించి రోజుకో కొత్త వార్త వెలువడుతోంది. అన్నీ కాంప్లెక్స్ పాత్రలు కావడంతో ప్రతీ నటుడూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని సమాచారం.
ఈ సినిమా విజువల్ వండర్గా నిలుస్తుందా.. ఇప్పటి తరాన్ని ఆకట్టుకునే పౌరాణిక ప్రయోగంగా గెలుస్తుందా అనేది 2026 శ్రీరామనవమి రోజే చూడాలి.